అలవాట్లను కూడితే- మనిషి. మనుషుల ఆచారాలను గుణిస్తే- సంస్కృతి. తెలుగు జాతి సఖ్యతకు, సమైక్యతకు ప్రతిబింబం మన ఈ సాహితీ వేదిక. పాఠక మహోదయులందరికీ 75వ గణతంత్ర వజ్రోత్సవ, విజయోత్సవ శుభాకాంక్షలు!!
ఏకాంతంలో ఆత్మ సాధనం, లోకాంతంలో పరోపకారం”. ఇదే సంఘకార్య రూపం, జీవన స్వరూపం. తేనేటీగల ఐక్యతే సమైక్యతకు సాధనకు నిదర్శనం, కృషితో నాస్తి దుర్భిక్షం నకు తార్కాణం, సాధనాత్ సాధ్యతే సర్వం అనుటకు ఒక ఆదర్శం, శ్రమయెవజయతే సూక్తికి స్ఫూర్తిదాయకం.
మనిషి - మనం మారాలి మార్పు రావాలి, స్వయం సాధకులం కావాలి. విజయాలు తేవాలి. భవితకీ మార్గం చూపాలి ఆచరించాలి. నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలి. నవభావనలతో నవోన్మేషణలతో నవయుగానికి నాంది పలకాలి. విశ్వసనీయత కలిగిన విశ్వశాంతి కోరాలి. అన్నింటికీ ఐక్యత సమైక్యతలే సాధనాలని గుర్తెరగాలి . కలిసివుంటే కలదు సుఖం. చేయి చేయి కలిపి, సమత మమతను పెంచి, చెడుని తుంచి, ఉన్నతిని అభ్యున్నతిని సాధించి మానవతా నిర్మాతలమై, సౌజన్య ప్రదాతలుగా ఎదగాలి. ఎదగాలి అంటే ఎదురీదక తప్పదు అన్న నిజాన్ని గ్రహించాలి. సమీప కాలంలోనే సంక్రాంతి ముగిసింది. వానచినుకుల్లో మబ్బు సంతకాలను మాను చిగురులతో వేళ మంతనాలను గుర్తించగల లోచూపు మనందరికీ అలవడాలి.
మనమందరం ఒక కథను స్మరించుకుందాం.....
హజ్రత్ అబూహురైరా(రజి) కధనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
ఒకతను తానీరోజు రాత్రి దానం చేస్తానని నిశ్చయించుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అతను (తెలియక) ఆ సొమ్ము ఒక దొంగకు ఇచ్చాడు. మరునాడు ఉదయం జనం రాత్రి ఒక వ్యక్తి ఒక దొంగకు దానం చేశాడని చెప్పుకోసారు. ఆ విషయం తెలుసుకొని అతను, "అల్లాహ్! నీకు కృతజ్ణతలు" అన్నాడు.
తర్వాత అతను తాను ఈ రోజు (రాత్రి) మళ్ళీ దానం చేస్తానని నిశ్చయించుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. కాని (ఆ రోజు రాత్రి కూడా) అతను ఆ దానం ఒక వ్యభిచారిణి చేతికిచ్చాడు. మరునాడు ఉదయం జనంలో మళ్ళీ రాత్రి ఒకతను వ్యభిచారిణికి దానం చేశాడని గుసగుసలు మెుదలయ్యాయి. అది తెలుసుకొని ఆ వ్యక్తి , "అల్లాహ్! నీకు కృతజ్ఞలు. నా దానం వ్యభిచారిణి చేతికి చిక్కింది.
నేను ఈ రోజు రాత్రి మళ్ళీ దానం చేస్తాను" అని అనుకొని ఇంటినుంచి బయలుదేరాడు. అయితే (ఆ రోజు కూడా) అతను ఆ దానం ఒక ధనికుడి చేతిలో పెట్టాడు.
మర్నాడు ఉదయం జనం గత రాత్రి ఒక ధనికుడికి దానం ఇవ్వబడిందని మళ్ళీ గుసగుసలాడుకున్నారు. ఆ విషయం తెలుసుకొని అతను "అల్లాహ్ నీకు కృతజ్ఞతలు.
(ఏమిటి ఇలా జరిగింది!) నేను ఒకసారి దొంగకు, మరొకసారి వ్యభిచారిణికి దానం చేశాను. ఇప్పుడేమో నా దానం ఒక ధనికుని చేతికందింది" అని అనుకొని (నిద్రపోయాడు). ఆ రాత్రి అతనికి కలలో ఒక వ్యక్తి కనిపించి ఇలా చెప్పాడు.
"నీ దానం వృధా కాలేదు,
(1). నువ్వు దొంగకు చేసిన దానం వల్ల ఆ దొంగ దొంగతనం చేయడం మానేయవచ్చు.
(2). వ్యభిచారిణికి చేసిన దానంవల్ల ఆమె తౌబా చేసుకొని (మంచి మనిషిగా) మారవచ్చు.
(3). అలాగే ధనికుడుకి లభించిన దానం వల్ల , ఆ ధనికుడు కూడా బుద్ది తెచ్చుకొని దేవుడు తనకు ప్రసాదించిన ధనంలో కొంతభాగం దైవ మార్గంలో సమాజ హితం కోసం సంఘ శ్రేయ కోసం ఖర్చుపెట్టవచ్చు." (సహీహ్ బుఖారిలోని జకాత్ ప్రకరణం)
జీవన సమస్యలు సునామీలను సృష్టించినా సంఘ శ్రేయం ఆగకూడదు. మనం చేసే పని నిస్వార్థ భావనతో కూడినదై ఉండాలి. ఎటువంటి స్వార్థాన్ని, పర ప్రశంసను ఆశించినదై ఉండకూడదు. మనం మన సమాజ అభివృద్ధి కోసం, దేశ అభ్యున్నతి, అభ్యుదయం కోసం, దైవ ప్రసన్నత కోసం చేస్తున్నాము అనే భావనతో పని చేయాలి. కానీ మన తీరు ఎలా ఉంది? నిరేపేదలు , అబాగ్య జీవులకు, వితంతువులు, వికలాంగులు, అనాథలకు మనం చేసే దాన దర్మాలకు మన అరచేతి నేస్తాలయిన మోబైల్ పోన్ లు ఇబ్బందికరంగానే మారినాయి. !
మనం ఒక చేతితో దాన దర్మాలు చేసి మరోక చేతితో వారి పోటోలను తీసి సోషల్ మిడియాల్లో పెట్టడం చాలా ఇబ్బందికరంగా మారింది. పేద వారి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఆత్మాభిమానం - మనం దాన్ని కూడా అంగడి సరుకులా అమ్మేస్తుంటే మానవత్వం నివ్వెర బోయి చూసే పరిస్థితి. ‘నీ రొట్టెను నువ్వు తింటే.. అది ప్రకృతి. నీ రొట్టెను పక్కవాడికి పెడితే అది సంస్కృతి… నువ్వు పక్కవాడి రొట్టెను లాక్కుని తింటే వికృతి. ఎవరో ఇచ్చిన రొట్టెను ఎవరికో పెట్టి ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టడాన్ని విషకృతి అనకుండా ఏమనాలో? మీ బుద్ధికే వదిలేస్తున్నాను.
అడగడం అలవాటు ఉన్నవాడు తన హక్కును ఎలాగు తీసుకుంటాడు. తన ఊరిలో లేదా పక్క ఊరిలో. కాని దిగువ తరగతి మద్య తరగతి కుటుంబాలలో ఆత్మాభిమానం గల అర్హులైనవారు తమ ఇంటిల్లిపాదికి చేరిన హక్కును తీసుకోవాలంటేనే భయ పడుతున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరోక చేతితో పోటోలు తీసి దాచుకున్న పరువును ఎక్కడ వీధి పాలు చేస్తారేమో అన్న భయంతో ఇంటి వాకిల్లు కూడా తీయలేకపోతున్నారు.
మీ సంపద నుండి మీరు (దైవమార్గంలో) ఏది ఖర్చుచేసినా అది మీకే లాభదాయకం. మీరు చేసేదంతా దైవప్రసన్నత కోసమే కదా! దైవప్రసన్నత కోసం మీరు ఏది ఖర్చుచేసినా దాని పుణ్యఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకేమాత్రం అన్యాయం జరగదు. ముఖ్యంగా దైవకార్యాల్లో నిమగ్నులైపోయి, జీవనోపాధి కోసం ధరణిపై తిరిగే అవకాశంలేని నిరుపేదలకు (ఆర్థికసహాయం చేయండి). వారి స్థితిగతులు ఎరగనివారు వారి ఆత్మాభిమానం చూసి వారు స్థితిపరులేనని భావిస్తారు. కాని వారి ముఖాలు చూస్తే మీరు వారి నిజస్థితి గ్రహిస్తారు. వారు (సిగ్గువదలి) ప్రజల వెంటబడి అర్థించే (యాచకు ల్లాంటి) వారుకాదు. వారి సహాయం కోసం మీరు చేసే ఏ ఖర్చయినా దేవునికి తెలియ కుండా ఉండదు. రాత్రింబవళ్ళు బహిరంగంగానూ, గోప్యంగానూ (దైవమార్గంలో) తమ సంపద ఖర్చు చేసేవారి కోసం తగినప్రతిఫలం వారి ప్రభువు దగ్గర సిద్ధంగా ఉంది. వారికి (అక్కడ) ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. (అల్-బఖరహ్; 272-274)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: అల్లాహ్(త) నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని ప్రళయ దినాన అల్లాహ్(త) ఏడుగురిని తన కారుణ్య ఛాయలో
ఉంచుతాడు.ఆ ఏడుగురు: వారిలో ఒకతను: కుడి చెత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియనంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (సహీ బుఖారీ, సహీ ముస్లం.)
మనం చేసే దానం మనకే నీడగా మారుతుందంటారా? తోడుగా ఉందంటారా? లేదా కాళనాగై కాటేస్తుందంటారా? వ్యక్తి మొదలు సంఘం వరకు, సంఘం మొదలు దేశం వరకు - పాలకులు పాలితులు అందరూ ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన సందర్భం ఇది.
రైతే రాజు అనే అచ్చే దిన్ రావాలి
భూమిని నమ్మిన జాతి మనది. 'రైతే రాజు' అనే భావన దేశానిది. అందుకే 'నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు ధార్మికుని దానాలు కవిరాజు కావ్యాలు... కర్షకా! నీ కర్రు కదలినన్నాళ్లే!' అన్నారు కాళోజీ. 'కృషీవలా! సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య, సౌఖ్యములకు- నీవె కారణము కావె' అంటూ ప్రస్తుతించారు దువ్వూరి రామిరెడ్డి. ఆ శ్రమైక జీవన సౌందర్యానికి, వ్యవసాయ సంప్రదాయ సౌభాగ్యానికి మనవంతు కృషి ఉడతా భక్తిగ్గానైనా మనం తప్పక చేయాలి. సంపద అంటే దాచిపెట్టేది కాదు, పంచిపెట్టేది అన్న యదార్థాన్ని గ్రహించాలి. సంతోషం తొలుత మన అంతరంగాల్లో ఆవిష్కారం కావాలి. అప్పుడు ప్రమిదలోని నూనె వత్తిలో ప్రవహించి జ్వాలను రగిలించినట్లు- గణతంత్ర వజ్రోత్సవ పేరుతో భారతీయ ఘన సంస్కృతి - భిన్నత్వంలో ఏకత్వం, దేశ ప్రేమ, మనమంతా భారతీయులం. భారత దేశం మనందరిది అన్న భావన మన ఎదలోకి ప్రసరించి జ్యోతిర్మయం చేస్తుంది. చేయాలి. వైయుక్తిక విభేదాలు మరచి, సమైక్యతా భావాలు పరచి, విశ్వశాంతి సాధన కోసం, నైతికవిలువలు వృద్ధిపరచి అభివృద్ధి బాటన మనం నడవాలి, జాతి జనాన్ని నడిపించాలి. భారతదేశం మనది. మనమంతా భారతీయులం - ఇలాంటి దేశంలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ప్రజలను విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది.
యువత.. దేశ భవిత..
ఏ దేశానికైనా శక్తివంతమైన యువత కంచు కోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి.
మనిషి జీవితం ఐదు దశలుగా సాగుతుంది. ఆ ఐదు దశల్లో అంత్యంత విలువైనది యవ్వనదశ. 15-35 ఏళ్ల మధ్య వయస్సుగల వారిని యువజనులుగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా, సృజనాత్మకంగా వుండే దశ. వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సాంఘిక సమూహం. ఇంటిలోనైనా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం. సందడికైనా, సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ. ఎక్కడైనా, ఎప్పుడైనా దేన్నయినా శోధించి.. సాధించి, అధిగమించి.. అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యమూ, సహకారమూ, లక్ష్యమూ జోడించగలిగితే- ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.
‘ఇవాళ్టి యువతను బట్టే.. రేపటి భవిష్యత్తు ఉంటుంది’ అంటారు ‘నేటి బాలలే రేపటి పౌరులు’గా, దేశభవితకు పునాదిరాళ్లుగా ఎదగాలంటే ఎలాంటి యువతరం ఈ దేశానికి అవసరం? నేటి యువతరం ఎలా ఎదుగుతోంది? అన్నది పరిశీలించాల్సిన అవసరం వుంది. చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం.
శాంతి, సహిష్ణుత, సుహృద్భావం నేటి అవసరం
సమాజంలో శాంతి, సద్భావన, సహకార భావన ఏర్పడాలి. ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగపు అమలు, సమాజపు ఆచరణాత్మకమైన సహకారం అనే మూడు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుత కష్టకాలం భవిష్యత్తు గురించి మనకు పాఠాలు నేర్పుతోంది. అవేమిటని జాగ్రత్తగా తెలుసుకుని వాటిని మన జీవితాలలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. మనమంతా కలిసి, ఆత్మవిశ్వాసంతో మనదైన ఈ దేశం, సమాజాన్ని ఈ సంకట స్థితి నుంచి బయటకు తెచ్చి ప్రపంచానికి దారిచూపే దేశంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని గుర్తుంచుకోవాలి. అదే మన కర్తవ్యం. నేడు అనేక సమస్యలను సునిశితంగా పరిశీలించి వాటిని ఒక అవకాశంగా తీసుకుని మనం ఒక నూతన, భవ్యభారత నిర్మాణానికి నడుంబిగించాలి. సోనే కి చిడియాగా మళ్ళీ భారత దేశం ఖ్యాతికెక్కాలి.
ఒక పిట్ట కథను గుర్తు చేసుకుంటూ మాటను పూర్తి చేసుకుందాం! ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో లో ఓ విలువైన ఖనిజం కోసం గనుల శాఖ వారు పెద్ద గుంతలు తవ్వి ఖనిజం దొరకలేదని వదిలేసి వెళ్లే సమయంలో - ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆ స్థలాన్ని కనుగోలు చేసి అప్పటికే కూలీడబ్బు తీసుకొని ఉన్న కూలీలను మరింత తవ్వమని చెబుతాడు. మరో మూడు అడుగుల లోతు తవ్వకం జరగగానే ఖనిజం బయట పడుతుంది. అనూహ్యంగా ఆ వ్యక్తి గనులకు అధిపతి అయి కోటీశ్వరుడుగా మారిపోతాడు. తరువాత తన జీవిత అనుభవంతో రాసిన వ్యాసానికి `డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ 3 ఫీట్’ అని పేరు పెడతాడు. అందుకే మనం చివరి వరకు నిరాశను దరి చేరనీయకూడదు. అవిరళంగా, అవిశ్రాంతంగా, నిరంతర ప్రవాహంలా, నిరతం పట్టు వీడని విక్రమార్కుల్లా విజయ ఢంకా మ్రోగించాలి! మన దేశ ఘాన గీతికలు నేల చెరగులా మారుమ్రోగేలా పరిశ్రమించాలి!!

No comments:
Post a Comment