సత్యం ప్రమోదాలకు నెలవు. - ప్రశాంతతకు కొలువు
ఓ ప్రవక్తా! ఇలా చెప్పు: “మీరు అల్లాహ్ ను కాదని ఆరాధిస్తున్న మీ దైవాలుగా భావించి వారందరిని మొరపెట్టుకొని చూడండి. వారు మీ కష్టాలను ఏమాత్రం దూరం చేయలేరు. ఆ స్థితిని మార్చలేరు కూడా. వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యం అన్వేషిస్తూ తమలో దేవునికి ఎవరెక్కువ సన్నిహి తులో అని ఆలోచిస్తున్నారు. ఆయన అనుగ్రహం ఆశిస్తూ, ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిజానికి నీ ప్రభువు శిక్ష భయపడవలసిన విషయమే. (బనీ_ఇస్రాయీల్: 56-57)
ఓ అల్లాహ్, నీకు స్తోత్రములు, నీవు ఆకాశములకు, భూమికి మరియు వాటిలోని వాటన్నింటికి అఖండ జ్యోతివి.
నీకు స్తోత్రములు, భూమ్యాకాశాలను మరియు వాటిలోని సమస్టాన్ని కాపాడువాడు నీవే.
నీవు సత్యము, నీ వాగ్దానం సత్యము, నిన్ను కలవడం సత్యము, స్వర్గం సత్యము, నరకం సత్యము, ప్రళయం సత్యము.
ఓ అల్లాహ్! నేను నీకు లొంగిపోయాను, నిన్ను నేను విశ్వసించాను, నీలో నేను నా నమ్మకం ఉంచాను, నీ వైపే నేను మళ్ళాను. నీ కోసమే వాదులాడాను, నిన్ను సాక్షిగా చేకునే తీర్పు తీర్చాను, కాబట్టి నన్ను క్షమించు, గతం తాలూకు పాపాలను, భవిష్యత్తు తాలూకు తప్పిదాలను క్షమించు! బహిర్గత, రహస్య పొరపాటలను మన్నించు. నువ్వే నా దేవుడవు, నా ఆరాధ్యుడవు, నీవు తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు.
సత్యం - సత్యమే సదా సాఫల్య ద్వారం. సత్యమే సమున్నతికి, మానవ జాతి ఉన్నతికి సోపానం - ఇహంలోనూ, పరంలోనూ.
ఈ ప్రపంచం అంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. ఉదయించి, అస్తమించే సూర్యుడు చల్లని వెన్నెల్ని వెదజల్లే చంద్రుడు నిజం. మిల మిల మెరిసే నక్షత్రాలు నిజం. వీచే గాలి నిజం. మండే నిప్పు నిజం. కురిసే వాన నిజం. ప్రవహించే జలం నిజం. మనిషి జననం నిజం. మనిషి మరణం నిజం. అనిత్యాలైన ఈ నిజాలన్నింటికీ మూల విరాట్టు నిత్య సత్యమైన అల్లాహ్. ఆయనే లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడు. అయితే మనిషి మాత్రం సత్యం పట్ల బాధ్యతతో వ్యవహరించడం లేదు. అసత్యానికి, అనిత్యాలైన ఐహిక ఆకర్షణలకి దాసోహమంటూ నిత్య బానిసగా జీవిస్తున్నాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం తెలుసుకోలేక పోతున్నాడు. లేనిదాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరచి, అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. తనను నఖ శిఖ పర్యంతం తీర్చదిద్ది ఇంత అందమైన ఆకృతిలో పుట్టించిన ఆ నిజ సుష్టికర్తను మరచి సృష్టితాలను పూజిస్తున్నాడు. తనలో ప్రాణం పోసిన ఆ ప్రమోన్నత ప్రభువును వదలి తానే ప్రాణప్రతిష్ట చేసిన తన లాంటి సృష్టితాలను ఆశ్రయిస్తున్నారు.
మనిషి తన అతి తెలివే తేటల వల్ల ఎదుటివారిని, మొత్తం ప్రపంచాన్ని మోసగించగలడే కానీ, మనసును మోసగించలేడు. అంతరాత్మను పెడదారి పట్టించలేదు. పాడుపని చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి, దురాశకు లోనయిన మనిషి ఈ హెచ్చరికలను లెక్కచేయడం లేదు. పాపానికి వెరవడం లేదు. మనిషిలోని ఈ వికృత ప్రవృత్తిని ఖుర్అఆన్ ఇలా ప్రశ్నిస్తుంది:
ఓ మానవుడా! దయామయుడైన నీ ప్రభువుని గురించి నిన్నేవిషయం మోసంలో పడ వేసింది? ఆయన నిన్ను పుట్టించి, నీ అవయవాలు పొందికగా అమర్చాడు. నిన్ను తగిన విధంగా రూపొందించాడు. తాను తలచిన రీతిలో నిన్ను (అందంగా) మలిచాడు.
అతని పొరుగింటి స్నేహితుడు అతనితో ఇలా అన్నాడు: “ఏవిటీ, నిన్ను మట్టితో నీచమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? నా విషయానికి వస్తే, నేను మాత్రం అల్లాహ్ ను మాత్రమే నా ప్రభువుగా స్వీక రించాను. ఆయన దైవత్వంలో మరెవరికీ భాగస్వామ్యం కల్పించను. (కహఫ్: 37-38)
మనిషీ, ఓ మనిషీ! మనీ మరియు షీ - స్త్రీయే జీవితం అనుకున్నావా?
సత్య మాటను, సత్య బాటను విస్మరించి, మోసం చేసే మనిషిని కాలమే సమాధానం చెబుతుంది. విషపు మొక్కను నాటి, అమృత తరువు మొలవాలంటే మొలవదు కదా? మనిషి ఏ భావనతో పనిచేస్తే, అలాంటి భావనకు తగిన ఫలితమే వస్తుంది. మోసం, వంచన మనసులో దృఢంగా గూడు కట్టుకొని ఉన్నప్పుడు మనిషి మాయ మాటలే చెబుతాడు. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి, మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన మహనీయులెందరో, దైవ ప్రవక్తలందరొ చరిత్రలో కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శపాత్రలై, లోకానికి స్ఫూర్తినిస్తాయి. ఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది;
అల్లాహ్ కు , ఆయన ప్రవక్తకు పూర్తిగా విధేయులయి వారి ఆజ్ఞలను పాటించేవారు (రేపు ప్రళయదినాన) అల్లాహ్ కటాక్షించిన ప్రవక్తలతో, సత్యసంధులతో, అమరవీరులతో, సదాచారసంపన్నులతో కలసి ఉంటారు. అలాంటివారి సహచర్యమే సహచర్యం. ఇది అల్లాహ్ అనుగ్రహం. అల్లాహ్ సర్వం తెలిసినవాడు. (అన్-నిసా: 69-70)
విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి. (అత్-తౌబా:119)
మనిషికి సత్యమాట, సత్య బాట ఒక దీక్షలా సాగాలి. నమ్మిన నిజ ధర్మం మీద నిలబడే దృఢత్వం కావాలి. ఎన్ని కష్టాలెదురైనా సత్యమాట తప్పరాదు. సత్య బాట వీడరాదు. సృష్టికర్తను వీడి సృష్టితాలను కొల్వరాదు.
మేము మానవుడ్ని నాణ్యమైన మట్టితో సృజించాము. తరువాత అతడ్ని ఒక సురక్షిత ప్రదేశంలో కార్చిన బిందువుగా మార్చాము. తరువాత ఆ బిందువును నెత్తుటి ముద్దగా రూపొందించాము. తిరిగి ఆ నెత్తుటి ముద్దను మెత్తటి పిండంగా చేశాము. ఆ తరువాత దాన్ని ఎముకలుగా మార్చాము. ఆ ఎముకలపై మాంసం కప్పాము. ఆపై (అందులో ప్రాణం పోసి) ఓ నూతన సృష్టినే ఉనికిలోకి తెచ్చాము. కాబట్టి దేవుడు ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. చివరికి మీరు చనిపోవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రళయదినాన మిమ్మల్ని తప్పకుండా తిరిగి బ్రతికించి లేపడం జరుగుతుంది. (అల్-మోమినూన్12-16)
రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు (వగైరా ప్రకృతి శక్తులన్నీ) అల్లాహ్ (ఏకత్వా నికి, ఆయన శక్తిసామర్థ్యాలకు) నిదర్శనాలే. (కనుక ప్రజలారా!) సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి. మీరు నిజంగా అల్లాహ్ ను ఆరాధించేవారయితే, వాటిని సృష్టించిన నిజ దేవునికే సాష్టాంగపడండి. (హా_మీమ్: 37)
సూర్యకాంతిని కప్పివేసేందుకు దట్టంగా మబ్బులు కమ్ముకుంటాయి. కానీ అవి ఎక్కువకాలం నిలువలేవు. సత్యం అనే సూర్యుడి తేజస్సుకు, అసత్యాల మబ్బులు కరిగిపోవలసిందే. సత్యం ఒక్కటే నిరంతరం వెలిగే సూర్యబింబం. ఎన్నటికైనా సత్యమే జయిస్తుంది. సత్యాన్ని ఎక్కువకాలం ఎవరూ మోసగించలేరు. సత్య సూర్యబింబాన్ని అరచేతులతో అడ్డుపెడితే చేతులు కాలిపోతాయి. గుట్టలకొద్దీ అసత్యాలను ఒక్క సత్యవాక్కు కూల్చివేస్తుంది. సత్యం ప్రమోదాలకు నెలవు. ప్రశాంతతకు కొలువు. నిర్భయత్వానికి ఆలవాలం. సకల విజయాలకు సత్యమే మూలం.
(నిజ దేవుడైన) అల్లాహ్ శ్రేష్ఠుడా లేక వీరాయనకు సాటి కల్పించిన దైవాలు శ్రేష్ఠమైనవా?
సరే, భూమ్యాకాశాల్ని ఎవరు సృష్టించారు? మీకోసం ఆకాశం నుండి వర్షం కురిపించి, తద్వారా మీకు సాధ్యంకాని మనోహరమైన తోటలను పండిస్తున్నదెవరు? ఆ అల్లాహ్ గాక (ఈ పనులలో ఆయనకు సహాయపడేందుకు) మరొక దేవుడెవరైనా ఉన్నాడా? (లేడు.) కాని వీరే సన్మార్గం వదలి (దుర్మార్గంలో పడి)పోతున్నారు. (అన్-నమల్: 59-60)
భూమిని నివాసయోగ్యంగా చేసిందెవరు? అందులో నదుల్ని పారజేసి, (కొండల) మేకుల్ని పాతిందెవరు? రెండు జలనిధుల మధ్య అడ్డంకిని పెట్టిందెవరు? అల్లాహ్తోపాటు మరో దేవుడున్నాడా? లేడు. అసలు వారిలో చాలామంది అజ్ఞానులే ఉన్నారు.
కష్టాలలో ఉన్నవాడు మొరపెట్టుకుంటున్నప్పుడు అతని మొర ఆలకించేదెవరు? చివరికి అతని కష్టాలు కడతేర్చుతున్నదెవరు? భూలోకంలో మిమ్మల్ని ప్రతినిధిగా చేసిందెవరు? అల్లాహ్తోపాటు మరో దేవుడున్నాడా (ఈ పనులు చేయడానికి)? మీరసలు (ఈ విషయాల్ని గురించి) చాలా తక్కువగా యోచిస్తారు. (అన్-నమల్: 61-62)
నేలమీద, సముద్రం మీద కటికచీకటిలో (సైతం) మీకు దారి చూపిస్తున్నదెవరు? ఎవరు తన కారుణ్యానికి (వర్షానికి) ముందుగా శుభవార్త తెచ్చే (చల్లటి) గాలులను పంపిస్తున్నది? అల్లాహ్తో పాటు మరో దేవుడున్నాడా (ఈ పనులు చేయడానికి)? వీరు చేస్తున్న సృష్టిపూజకు అల్లాహ్ ఎంతో అతీతుడు, మహోన్నతుడు. (అన్-నమల్: 63)
ప్రాణులను తొలిసారిగా సృజిస్తున్నది, తర్వాత వాటిని పునరుత్పత్తి చేస్తున్నదెవరు? భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధి ప్రసాదిస్తున్నదెవరు? అల్లాహ్తోపాటు మరో దేవుడు కూడా ఉన్నాడా (ఈ పనులు చేయగలిగేవాడు)? వారినడుగు ‘మీ అభిప్రాయం నిజమైతే వీటికి (తగిన) ఆధారాలేమిటో చూపండ’ని. (అన్-నమల్: 64)
చెప్పు:“భూమ్యాకాశాల్లో అల్లాహ్ కు తప్ప మరెవరికీ అగోచర విషయాలు తెలియవు. వారికి (మరణానంతరం) తాము ఎప్పుడు లేపబడతామో కూడా తెలియదు. (అన్-నమల్: 65)
ఓ సమయం వస్తుంది – అప్పుడు - ఇలా అనబడుతుంది:
“సత్యం వచ్చింది. అసత్యం తుడిచి పెట్టుకుపోయింది. అసత్యం (ఏనాటికైనా) తుడిచి పెట్టుకుపోయేదే.” (బనీ_ఇస్రాయీల్: 81)
మనిషి సత్యాన్ని నిత్యజీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. మేలిమి బంగారం, వజ్ర వధూర్యాలు, మణిమాణిక్యాల కన్నా ఎంతో విలువైనది సత్యం. దుష్టులపాలిటి వజ్రాయుధం- సత్యం. అసత్యాల విషవాయువులు మానవాళికి ముప్పు కలిగిస్తున్నప్పుడు, సత్యం రక్షక కవచమై కాపాడుతుంది. ప్రాణవాయువయి బతుకును నిలుపుతుంది. స్వేచ్ఛావాయువై ఆనందాన్ని అందిస్తుంది. మలయమారుతమై ఆత్మలో శాంతిని, లోకంలో కాంతిని, క్రాంతి నింపుతుంది.


No comments:
Post a Comment