ఈ దివ్య గ్రంథంలో – సృష్టి ప్రక్రియ గురించి, సృష్టికర్త ఘనత ఔన్నత్యం గురించి హృదయాన్ని హత్తుకుని మదిలో ముద్రవేసే స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి.
ఈ దివ్య గ్రంథంలో – ఏకదైవారాధనకు సంబంధించి హేతుబద్దమ యిన నిదర్శనాలూ ఉన్నాయి. బహుదైవారాధను ఖండించే సహేతుకమ యిన నిరూపణలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – మానవుని పుట్టుకను గురించి, ఈ సువిశాలమైన విశ్వంలో మానవుని పుట్టుక లక్ష్యం ఏమిటో తెలియజేసే వాక్యాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – పూర్వప్రవక్తల మచ్చలేని జీవితాల గురించి, తమ తమ జాతులకు వారు అందజేసిన సత్యసందేశం గురించి సమాచారమూ ఉంది. దైవ సందేశహరులను ధిక్కరించిన జాతుల పర్యవసానం గురించి గుణపాఠమూ ఉంది.
ఈ దివ్యగ్రంథంలో – చారిత్రక గాథలూ ఉన్నాయి. విశ్వాసులకు దైవవిధేయులకు ఇహపరలోకాలకు సంబంధించిన శుభవార్తలూ ఉన్నాయి. అవిశ్వాసులకు దైవధిక్కారులకు హెచ్చరికలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – మానవుల హక్కులకు సంబంధించిన నీతి బోధనలూ ఉన్నాయి. మానవుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ధర్మశాసనాలూ ఉన్నాయి. నాగరిక, రాజకీయ, ఆర్థిక , సామాజిక విష యాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడే సూత్రాలూ ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ శాంతి సామరస్యాలకు సంబంధించిన ఆదేశాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – జనుల్లో ఉన్న అంధవిశ్వాసాలు, మూఢనమ్మ కాలు, పూర్వీకుల అంధానుకరణ మొదలయిన విషయాల్లోని ఘోరమ యిన తప్పుల్ని, అత్యాచారాలు, అన్యాయం, దౌర్జన్యం, అరాచకాలను స్పష్టమయిన ఆధారాల ద్వారా ఖండించడమూ జరిగింది.
ఈ దివ్యగ్రంథంలో – ప్రాపంచిక జీవిత వాస్తవికత, మరణానంతర జీవితానికీ సంబంధించిన స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి.
ఈ దివ్య గ్రంథం తొలి ప్రారంభ అవతరణకు 1458 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇందులో ఎలాంటి మార్పూ చేర్పూ జరగలేదు. ఇది నేటికీ సురక్షితంగా ఉన్న ఏకైక దివ్యగ్రంథం. అలాంటి మహిమాన్విత గ్రంథరాజ రాజసం గురించి కొన్ని అంశాలను ఇక్కడ పోదు పర్చడం జరిగింది. ఇది ఒక విధంగా మహా జ్ఞాన సాగరాన్ని కూజాలో బంధించడం వంటిదే... పూటకో విద్యాకుసుమం అందులో వికసిస్తూ ఉంటుంది. రోజుకో కొత్త విజ్ఞాన ఫలం చదువరులను ఊరిస్తూ ఉంటుంది, దివ్య ఖుర్ఆన్ జ్ఞానం దాని లోతుల్లోకి పోయేకొలది విలువైన ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు దొరుకుతూనే ఉంటాయి. ఏ అనువాదకుడైనా, మరే వ్యాసకర్త అయినా, వక్తయినా, ప్రబోధనకర్త అయినా ఆ ముత్యాలన్ని తన పద హారంలోనే ఇమిడిపోవాలని ఆశిస్తే అది అతని అమాయకత్వమే అవుతుంది.
ఖుర్ఆన్ ప్రత్యేకతలు
పవిత్ర ఖుర్ఆన్ శాశ్వత మహిమ. ఎంఎందుకంటే - భూమి మీద అవతరించిన ఆకాశ గ్రంథాలలో - అల్లాహ్ వాక్యాలు అక్షర పరంగానూ, అర్థ పరంగానూ ఎలాంటి మారుచేర్పులకు, మానవ జోక్యానికి గురి కాకుండా సురక్షితంగా ఉన్న ఏకైక దైవ గ్రంథం ఖుర్ఆన్ మాత్రమే.
* పవిత్ర ఖుర్ఆన్ - స్వయంగా అల్లాహ్ ఈ గ్రంథ సంరక్షణా బాధ్యతను తానే స్వీకరించాడు. ఈ గ్రంథం తరం తర్వాత తరానికి గ్రంథం రూపంలోనూ, కంఠస్థం రూపంలోనూ చేరుతూ - ఎలాగైతే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి అవతరించినప్పుడు ఉండేదో నేటికీ అది అలాగే ఉంది. ఈ గ్రంథం తనకు పూర్వం అవతరించిన దైవగ్రంథాలన్నింటి సారాశాన్ని సంరక్షించే గ్రంథం.
వారికి చెప్పు: “యావత్తు మానవులు, జిన్నులు ఏకమయి కఠోర తపస్సు చేసినా, పరస్పరం సహకరించుకున్నా, ఖుర్ఆన్లాంటి గ్రంథాన్ని ఎన్నటికీ రచించలేరు.” (బనీ_ఇస్రాయీల్: 88)
పవిత్ర ఖురాన్ వచన రీత్యా, పఠన శైలి రీత్యా భద్రపరచబడింది.
ఖుర్ఆన్ గ్రంథానికి గల సాహితీ కోణాలు అనంతం! వాటిని కొలవాలను కోవటం అవివేకం!! ఎల్లలు లేని విజ్ఞానవనం ఒక్క అంతిమ దైవగ్రంధానికి సొంతం.
* దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన మీద అవతరించే దివ్యావిష్కృతిని (వహీని) లిఖిత పూర్వకంగా వ్రాసే నిమిత్తం కొందరి నియమించారు. ఉదాహరణకు - హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (ర), ఉబై బిన్ కఅబ్ (ర), జైద్ బిన్ సాబిత్ (ర) మొదలైనవారు. వీరు దైవ ప్రవక్త (స) వారి మీద అవతరించే ఖుర్ఆన్ గ్రంథాన్ని వ్రాసి భద్ర పర్చేవారు. దైవ ప్రవక్త (స) వారి మరణ సమయానికి - ఖుర్ఆన్ - ప్రతులు రూపంలో ఉండేది. దైవ ప్రవక్త (స) మరణానంతరం - హజ్రత్ అబూ బకర్ (ర) గారి పరిపాలనా కాలంలో - దాన్నో మహా కార్యంగా తీసుకుని - ఆ ప్రతులన్నింటినీ గ్రంథంగా చేయడం జరిగింది.
* ఇస్లామీయ రాజ్య విస్తీరణ మరింత ఎక్కువగా పెరిగినప్పుడు - అనేక మంది ఇస్లాం ఛత్ర ఛాయల్లోకి వచ్చి చేరినప్పుడు - మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ఖుర్ఆన్ గ్రంథపు అనేక ప్రతులను తయారు చేసి ఆయా రాజ్యాల, ప్రాంతాల వైపునకు పంపే ఏర్పాటు చేసేవారు. అలాగే ఆయా ప్రాంతాలోని ప్రజలకు ఖుర్ఆన్ ఎలా చదవాలో నేర్పించడానికి ఖుర్ఆన్ పారాయణకర్తలను కూడా పంపేవారు.
నేటి ముస్లింల చేతుల్లో ఉన్న ఖుర్ఆన్ వాకాయాలు 14 శతాబ్దాల క్రితం అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై అవతరించిన ఖుర్ఆన్ వాక్యాలు అచ్చం ఒకేలా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎలా సాధ్యమయిందంటే, తరం తర్వాత తరం ఖుర్ఆన్ పారాయణకర్తలు ఈ గ్రంథాన్ని కంఠస్థం చేస్తూ వస్తున్నారు అనేది ఒకటి. అలాగే చారిత్రకంగా ఈ గ్రంథం దైవ దూత హజ్రత్ జిబ్రయీల్ (అ) నుండి దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి వద్దకు, ఆయన నుండి తర్వాతి తరాలకు అదెలా చేరిందో సాక్ష్యాధారాలతో సహా గ్రంథస్తం చేయబడి ఉంది. అల్లాహ్ వద్ద నుండి ఈ గ్రంథాన్ని తీసుకు వచ్చినవారు హజ్రత్ జిబ్రయీల్ (అ) అయినప్పుడు అందులో ఒక్క పదం కూడా ఇటూ అటూ అయ్యే ఆస్కారమే లేదు. నేడు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం నాడు దైవ ప్రవక్త (స) వారిపై అవతరించిన ఖుర్ఆన్ రెండూ ఒక్కటే.
ఖుర్ఆన్ మృదు మధుర పరాయణానికి ముగ్దుడయిన వలీద్ బిన్ ముజీరా - ఇలా అన్నాడు; అల్లాహ్ సాక్షిగా చుబుతున్నా - ఖుర్ఆన్ ధుని స్వర్ణకార సుమధుర ధ్వని. దాని తేజం అద్వితీయం, అమోఘం, అమేయం, అనన్య సాధ్యం, అఖండం, అనిర్వచనీయం. దాని పై భాగం ఫలవంతం. దాని క్రింది భాగం రసభరితం. దానిదే పై చేయి - శిఖరం దాని స్థాయి - విజయం దాని దారి, కీర్తి దాని చిరునామా. అది పైపైకి ఎగబ్రాకుతుందేగానీ, పతనం ఎరుగదు. దాని ముందర ప్రపంచ ఏ సాహిత్యమయినా దిగదుడుపే.
తజ్వీద్ ఖుర్ఆన్ గ్రంథానికి సంబంధించిన ప్రత్యేక విద్య
* ఖుర్ఆన్ పారాయణం తజ్వీద్ విద్యకు లోబడి జరుగుతుంది. ఈ విద్య - పవిత్ర ఖుర్ఆన్ ను ఎలా చదవాలో మరియు దాని అక్షరాలు మరియు పదాల ఖచ్చితమైన ఉచ్చారణను ఖచ్చితమైన పద్ధతిలో ఎలా పలకాలో తెలియజేసే శాస్త్రం. దైవ ప్రవక్త (స) నుండి ఎలాగైతే వారికి ఖుర్ఆన్ పారాయణం చేరిందో అలాగే పారాయణం చేయడానికి ముస్లింలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. అయితే ప్రత్యేక ఈ శాస్త్ర కూర్పు ఏదైతే ఉందో అది - హిజరీ శకం 154 వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుండి ఇది ఓ ప్రత్యేక విద్యా శాస్త్రంగా ప్రశిద్ధి చెందింది. అంటే ఈ శాస్త్ర కూర్పు జరిగి 1200 సంవత్సరాలకు పై చిలుకు అవుతుంది. ఆ విధంగా - లాటిన్ నుండి ఉద్భవించిన లేదా ప్రభావితమైన ఆరు యూరోపియన్ భాషలలోని ఫొనెటిక్స్ మరియు లింగ్విస్టిక్స్ శాస్త్రాల కంటే తజ్వీద్ శాస్త్రం 1,000 సంవత్సరాల కంటే ముందు ఉంది.
* ఉపాధ్యాయుని నోటి నుండి అభ్యాసకుల చెవి వరకు ఖురాన్ యొక్క ఫ్రీక్వెన్సీ పఠనం, తరతరాలు, అంతరాయం లేకుండా, వైవిధ్యం లేకుండా పారాయణం చేయబడుతూ వస్తున్నదంటే ఇదిఎంతో అద్భుతమైన విషయం. అదే దివ్య్ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఇతర ఆకాశ గ్రంథాల నుండి ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది.
* ఒకరి నుండి మౌఖికంగా విని దాన్ని నేర్చుకోవడం, నేర్పించడం అనే ఈ అద్భుత ప్రక్రియ నేటి వరకూ కొనసాగడానికి - అల్లాహ్ కృపానుగ్రహాల అనంతరం - ఈ విద్య పట్ల ముస్లిం పండితుల శ్రద్ధాసక్తులే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లాహ్ వాక్యాన్నిభద్రపరచి యథావిధిగా మానవాళికి చేరవేయాలి అన్న గొప్ప సంకల్పం వారికుండేది. అలా చేరవేసే గొప్ప బాధ్యత తమపై ఉందని వారూ భావించేవారు. బలంగా దాన్ని ప్రపంచ మానవాళి వరకు చేరవేసే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేసేవారు.
ఖుర్ఆన్ మరియు హదీసుకి మధ్య వ్యత్యాసం
దైవ ప్రవక్త (స) వారి ప్రవచనాలు, ఆయన నేర్పిన విషయాలు - కేవలం అల్లాహ్ వాక్యాలు మాత్రమే కలిగిన ఖుర్ఆన్ గ్రంథంతో కలగాపులగం కాలేదు.. ధర్మ పండితులు మహనీయ ముహమ్మద్ (స) వారి ప్రవచనాలను, ఆయన ఆచరణలను, ఆయన మౌనం వహించి అనుమతించిన విషయాలను ప్రత్యేకంగా గ్రంథ రూపం ఇచ్చారు. వాటిని హదీసు గ్రంథాలంటారు. ఉదాహరణకు - ప్రవక్త (స) వారి మాటలు, ఆయన ప్రవచనాలను కౌలీ సున్నత్ - వాక్కు పరమైన సున్నత్ అని, నమాజు విధానం, నమాజు భంగిమలు, హజ్జ్ అర్కానులు, విధానం తదితర విషయాలను అమలీ సున్నత్ ఆచరణ పరమైన సున్నత్ అని, ఒకరు చేస్తుండగా, ఒక మాట అంటుండగా చూసి మౌనంగా ఉండటాన్ని - తఖ్రీరి సున్నత్ - అనుమతించిన సున్నత్ అని పండితులు నామకరణం చేశారు.
* మహనీయ ముహమ్మద్ (స) వారి, మాటలను, ఆయన ఆచరణలను, ఆయన అంగీకారాన్ని - ''సున్నత్' అంటారు. ఇక ఏ గ్రంథంలోనైతే కేవలం అల్లాహ్ వాక్యం ఉందో (ఏ మనిషి మాట లేదో) దాన్ని పవిత్ర ఖుర్ ఆన్ అని పిలుస్తారు.
* ఖుర్ఆన్ దివ్యగ్రంథాన్ని ఇతర మత గ్రంథాలతో ఏ విధంగానూ పోల్చకూడదు. ఇతర మత గ్రంథాలు ఆయా రచయితలు - దైవ ప్రవక్తలు చెప్పిన ధర్మ విషయాలను వారు తమ భాషలో, తమ శైలిలో, తమ సొంత వ్యాఖ్యతో గ్రంథస్థం చేశారు.
* ఉదాహరకు - చర్చీకి సంబంధించిన కొత్త నిబంధనలు అన్న పేరుతొ ప్రశిద్ధిగాంచిన నాలుగు సువార్తలు - అవి వాటి రచయితల పేరుతోనే గుర్తించబడ్డాయి. (మత్తయి, మార్కు, లూకా, యోహన్న. అలాగే పాత నిబంధనలు 1400 సుదీర్ఘ కాలంలో 40 వేర్వేరు రచయితల ద్వారా వ్రాయబడింది.
భూమండలం మీద పద పరంగానూ, అర్థ పరంగానూ ఎలాంటి మారుచేర్పులకు, హెచ్చుతగ్గులకు ప్రళయ వరకు ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది ఖుర్ఆన్ మాత్రమే. అది అల్లాహ్ వాక్యం. యుగాలు గడిచిన,తరాలు మారినా అది మార్పు చెందని శాశ్వత మహిమ. అందులో ప్రజలందరి ప్రభువు సందేశాలు ఉన్నాయి. అందులో ధర్మ శాస్త్రం, మరియు జీవితానికి అవసరమైన ఉత్తమ బోధనలు ఉన్నాయి.
ముహమ్మద్ (స)! మేము నిన్ను యావత్తు మానవాళి కోసం (స్వర్గ)శుభవార్త అందజేసేవానిగా, (దైవశిక్ష గురించి) హెచ్చరించే వానిగా చేసి పంపాము. కాని చాలా మందికి ఈ వాస్తవం తెలియదు. (సబా: 28)


No comments:
Post a Comment