Saturday, August 24, 2024

నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు - Light a lamp in you, let yourself shine and spread

నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు ఆత్మహత్యల మాటకొస్తే, అనాదిగా ఈ ఘోరాలు మనం వింటున్నవే. కాదనం. కానీ, అది భరించుకోగలిగినంత శాతంలోనే జరిగింది. కానీ ఈనాటి పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఆత్మహత్య వార్త లేని రోజంటూ లేకుండా పోయింది.
క్షణికొద్రేకానికి లోనయి తప్పుడు పనులు చెయ్యడం, క్షణికమైన ఆవేశానికి లోనయి హత్యలు చెయ్యడం, క్షణికమైన ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలు చేసుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.. వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే కావొచ్చుగాక.. ఒక్క క్షణాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోలేనివారు అంతకు ముందు సమాజానికి ఏమి చెప్పినా ఏమి చేసినా నిరర్ధకమే. "మాటలు కాదు చేతలు, ఉదాహరణలు చెప్పకు నీవే ఒక ఉదాహరణగా మారు" అంటారు. లోకజ్ఞానం సముద్రమంత వున్నా బిందువంత ఆత్మ జ్ఞానం లోపిస్తే మనిషి జీవితానికి అర్ధం వుండదు.. అందుకే కేవలం మనో వికారాలకి లోనయ్యే ప్రపంచ జ్ఞానం కన్నా, మనలో ప్రకాశాన్ని వికాసాన్ని కలిగించే ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం.. అందుకే సినారె గారు - "నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు" అన్నారు. నేటి ఒంటికాయ శొంఠి కొమ్ము బతుకులు మనుషుల జీవితాల్లో నిరాశా నిస్పృహలనే మిగులుస్తున్నాయి. చదువులు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జీవితావసరాలు వున్నవాటికన్నా రెట్టింపు పెరిగాయి. సౌకర్యాలు పెరిగాయి, సౌలభ్యాలు పెరిగాయి. దానితో పాటు మనిషికి మనిషికీ మధ్య సంబంధ బాంధవ్యాల దూరాలు కూడా చాలా చాలా పెరిగాయి. దానివలన మనుషుల్లో అభద్రతా భావం అధికంగా పెరిగిపోయింది. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప గొప్ప సంస్థలకి అధిపతులు, రాజకీయనాయకులు, సినీ కళాకారులు, రచయితలూ యీ కోవకి చెందిన వారే ఆత్మహత్యలకి అధికంగా పాల్పడుతుండడానికి కారణం ఒక్కటే... అదే ఒత్తిడి, భరించలేని మానసిక ఒత్తిడి.. ఉన్నదాన్ని నిలుపుకోలేక, లేనిదాన్ని అందుకోలేక నడుమ నలిగే మానసిక సంఘర్షణకి చరమ గీతం ఆత్మహత్య అన్న భావానికి లోనవుతున్నారు. ఇటీవల మనస్తత్వశాస్త్ర విశ్లేషకుడు ఒకాయన నేటి ఆత్మహత్యల వెనుక నున్న కారణాలను విశ్లేషిస్తూ, "మెదడులో కొన్ని రసాయనిక పదార్థాలు లోపించడం వలన రక్త ప్రసరణ మెదడుకి అందక ఆ అస్తవ్యస్త పరిస్తితిలో ఆత్మహత్యకి పాల్పడతారు" అని చెప్పారు.. అంటే ఇంచుమించు బ్రెయిన్ డెడ్ లాటిదన్నమాట. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి జీవచ్చవమే కదా! ఈ దయనీయ స్థితికి కారణం అధిక మానసిక ఒత్తిడి, భరించలేని, తట్టుకోలేని మానసిక ఒత్తిడి అంటాడాయన.. అటువంటి స్థితిలో ఎవరయినా దగ్గర వుంటే, వారి స్థితిని గ్రహించి, సాంత్వన పలుకుతూ, వెన్నుతట్టి, నీకు భయం లేదు, నేనున్నాను అని ప్రోత్సహిస్తే కొంత ఒత్తిడి తగ్గి మెదడులో చలనం కలగవచ్చు, లేదంటే తమకి అత్యంత ప్రియమైన వారి ఫోటోలను తదేకంగా చూస్తూ వారికోసం నేను బ్రతకాలి అనే భావంతో కొంత ఒత్తిడి తగ్గించుకోవచ్చట... అటువంటి సమయాల్లో ఒంటరితనం అభద్రతా భావాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం: ఒకప్పుడు ప్రజల్లో పెద్దలంటే భయ గౌరవం, దేవుడంటే నమ్మకం ఉండేవి. దైవ భక్తీ ఉన్నవారిలో పాప భీతి వుండేది. ఆత్మహత్య మహా పాతకం అని నాటి పెద్దల మాటమీద నమ్మకం వుండేది. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా స్థైర్యంతో ఎదుర్కోగల మనో నిబ్బరం, సహనం ఉండేవి. అలాగే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కూడా వెన్నుదన్నుగా వుండడం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు తక్కువగా ఉండేవి. నేడు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది పూర్తిగా హ్రస్వమై పోయింది. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయిలు, మామయ్యలు అందరితో కళకళలాడే నాటి నిండు కుటుంబాలు సినిమాల్లో తప్ప నిజజీవితంలో మచ్చుకయినా కానరావడం లేదు. ఆత్మహత్య అంటే 'తనని తాను అంతమొందించుకోవడం..' అనే ఈ ఘోరమైన ఆలోచన ఎలా వస్తుంది? ఎలాటి కారణాలు ఆత్మహత్యకి ఉసిగొల్పుతాయి? • అధిక శాతం జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సంఘటనలు, అనుభవాలు, వైఫల్యాలు ప్రధాన కారణాలు అని చెప్పాలి. దీని వల్ల కలిగే నిరాశ నిస్పృహల వల్ల బ్రతకాలనిపించదు. శరీరం నించి ప్రాణం వెళ్ళిపోతేనే తప్ప ఆత్మకి శాంతి దొరకనంత అశాంతి వల్ల, ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడతారు. ఎలాటి పరిస్థితుల్లోనైనా ఊపిరి ఆగిపోవాలి అనే బండ నిర్ణయం వల్ల ఈ కఠినమైన శిక్ష విధించుకుంటారు. * ఎంతో ఆశతో విదేశాలకెళ్ళినప్పుడు అక్కడ నీరు గార్చే హీన పరిస్థితుల్లో బ్రతుకీడ్చడం ఇష్టం లేక, ఆత్మహత్యలకు పాల్బడుతున్న వారెందరో. తన తప్పిదం వల్ల ఒక మనిషి చనిపోయాడన్న పశ్చాత్తాపంతో, పాప భీతి వెంటాడటంతో ప్రాయచ్చిత్తంగా – ఇటీవలే ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దుర్వసనాల ఊబిలో చిక్కిన వారిలో - మద్యానికి, డ్రగ్స్కీ బానిసలైన వారు, పర స్త్రీ వ్యామోహం, విశృంఖలత్వం, నయము కాని అంటు వ్యాధులు ప్రబలి, చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని అంతమొందించు కోవాలనుకుంటారు. ఇక యువతలో ఐతే, చదివే చదువు ఏ మాత్రం బుర్రలోకి వెళ్లక, సిలబస్ అర్థం గాక డిప్రెస్ అవుతున్నారు. ఇలా ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, లేదా టీజింగ్, రాగింగ్, ఇంకా - రాంక్ రానందుకు, ప్రేమ వైఫల్యమైనప్పుడు, లేదా పెళ్ళికి పెద్దలు అంగీకరించనప్పుడు, ఉద్యమాల ఉద్రేకంలోనూ – ఆత్మహత్యలు జరుగుతుంటాయి. * ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్న మొండి వైఖరిని చూస్తున్నాం. సినిమాకి తీసుకెళ్లలేదనీ, గేమ్స్ ఆడనీకుండా, తల్లి తండ్రులు సెల్ లాగేసుకున్నారనీ, పుట్టింటికి పంపలేదనీ.. ఇలాటి చిన్న చిన్న కారణాలుగా కూడా ఆత్మహత్యలకి పాలబడుతున్నారు. * రేప్ - అతి భయంకరమైన సామాజిక కారణంగా చెప్పుకోవాలి - ఆత్మహత్యల వెనక నిలుస్తున్న ఇదొక పెద్ద కారణం. చాలా నేరాలు కప్పేయ బడుతున్నాయి. స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు హింసలు అనేకానేక రకాలు. వాట్ని భరించలేక స్త్రీలు ఆత్మహత్యకు తలపడుతుంటారు. * పరువు ప్రతిష్ఠలు దెబ్బ తిన్నప్పుడు, నలుగురిలో తలెత్తుకోలేక కొందరు ఉన్నత విద్యావంతులు, వైద్యులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటారు. నమ్మిన వాని వలలో ట్రాప్ అవడం, ఆ పైని బ్లాక్ మెయిలింగ్, మెంటల్ టార్చర్, గృహ హింసలు తట్టుకోలేక గృహిణిలు సూసైడ్ చేసుకుంటున్నారు. • పెళ్ళి కాకుండా మిగిలిపోవడం, ఒంటరితనం, పెళ్లైన వారికి సంతానం కలగకపోవడం. పోషించే భాగస్వామి మరణించడం, అంగవైకల్యం గల సంతానాన్ని కలిగి వుంటం, కుటుంబ తగాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఇవన్నీ వ్యక్తిగత కారణాలుగా నిలుస్తాయి. • అనైతిక సంబంధాలు, శారీరక రుగ్మతలు, ఎలాటి వైద్యానికీ నయం కాని దీర్ఘ కాల జబ్బులు, భరించుకోలేని బాధలు, - గ్రహించలేని మానసిక వ్యాధులు, భయ భ్రాంతులు, అపోహలు, అనుమానాలు, మూఢ నమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ కూడా కారణం. ఇవి ఎక్కువ గా పల్లెల్లో నివసించే వారిని బాధిస్తున్న సమస్యలు. * పిల్లలు కిడ్నాప్ అయినప్పుడు, కళ్ళ ముందే తమ వారిపై దారుణాలు జరిగినప్పుడు, ఆక్సిడెంట్స్ రక్త సంబంధీకులను పొగుట్టుకున్నప్పుడు, వృద్ధాప్యంలో పిల్లలకి భారమయినప్పుడు, ఆర్థికంగా దిగబడిపోతున్నప్పుడు - ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. * ఆర్ధిక పరమైన కారణాలు: అప్పులు చుట్టు ముట్టి, తీర్చలేక పోవడం, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, కోర్ట్ కేసు గెలవలేకపోయినందుకు, పెద్ద పెద్ద వ్యాపారాలలో భారీ నష్టం వచ్చినప్పుడు, కంపెనీ మూసేయాల్సి వచ్చినప్పుడు, ఇల్లు, ఆస్తి, మూలధనం, భూమి, కోల్పోయినప్పుడు తనువు చాలించడమొకటే మార్గంగా నిర్ణయానికొస్తున్నారు. ప్రకృతి బీభత్సాలు, వైపరీత్యాలు, సమాజానికి కూడా, మనిషికి మల్లేనే శరీరం వుంటుంది. అవయవాలూ వుంటాయి. బాడీ టెంపరేచర్ వుంటుంది. సమ ఉష్ణోగ్రతలో వుంటేనే ఆరోగ్యంగా వున్నట్టు. మించిన అధిక ఉష్ణోగ్రతలున్నప్పుడు దానికీ మనలానే జ్వరం వచ్చినట్టు. వెంటనే పట్టించుకోకపోతే, మూలపడుతుంది. మూల్గుతూ వుంటుంది. ఆ! ఏడ్వనీ అని వొదిలేస్తే చివరికి కోమాలో కెళ్తుంది. ఆ పైన ప్రాణాలే కోల్పోతుంది. సమాజం అనారోగ్యం పాలైతే.. మనిషీ ఆరోగ్యం గా బ్రతకలేడు. అది చచ్చిపోయాక, మనిషి బ్రతికీ జీవచ్చవమే అవుతాడు. ఇది సత్యం.అదీ - మనకీ, సమాజంలో జరిగే మంచి చెడుల సంఘటనలకీ మధ్య గల సంబంధం బాంధవ్యం. రేయీపగలులా, చెట్టూ విత్తనంలా, జననం మరణంలా మనమూ, సమాజమూ! సమాజం బావుంటే మనమూ బావుంటాం.

No comments:

Post a Comment